● అభివృద్ధి, సంక్షేమం లేదు
● ఆలూరులో నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: రాష్ట్రంలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి నల్లబెలూన్లు ఎమ్మెల్యే ఎగురవేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, మోసాలు, దగాపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఈ నెల 12న నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దోచుకొని..దాచుకోవడమే!
రెండేళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకొని..దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఎమ్మెల్యే విమర్శించారు. సంక్షేమ పథకాలు అటకెక్కాయన్నారు. ఎక్కడా అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, ఉద్యోగులను.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రూ.కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. హామీ లు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చేశారన్నారు. గడిచిన రెండేళ్లలో ఏకంగా రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. కార్యక్రమంలో నాయకులు మండల కన్వీనర్ మల్లికార్జున, భాస్కర్, గుండయ్య, నాగప్ప, వెంకటేషులు, దానాల రాజు, శేఖర్, వరుణ్, సాయి, కొట్టాల రాజు, హనుమంతప్ప, గజ్జలప్ప, మల్లయ్య, గౌస్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


