న్యూస్రీల్
అత్యవసర విభాగాల్లో వైద్యశాఖ ఒకటి. ఏ సమయంలోనైనా ఆపదలో ఉన్నవారికి వైద్యం అందించడం డాక్టర్ల విధి. అన్ని ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోని పీహెచ్సీల్లో డాక్టర్తో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచింది. సమర్థవంతంగా వైద్యం అందించాలని సూచిస్తుండగా.. అందుకు విరుద్ధంగా అక్కడి సిబ్బంది, డాక్టర్లు వ్యవహరించడం విడ్డూరం.. సెలవురోజులు, ఆదివారాలతో పని లేకుండా వైద్య సేవలు అందించాల్సినవారు అందుబాటులో ఉండడం లేదు. ఆదివారం జిల్లాలోని పలు పీహెచ్సీలను ‘సాక్షి’ విజిట్ చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మూ కొట్టగా.. మరికొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చారు. ఇంకొన్ని చోట్ల ఆదివారం సెలవు దినం అన్నట్లు పీహెచ్సీలకు తాళం వేశారు.
కొత్తపల్లి పీహెచ్సీకి తాళం
కొత్తపల్లి(కరీంనగర్): అత్యవర వైద్య సేవలు అందించాల్సి న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆదివారం తాళం వేసి ఉండటంతో రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదివారం 11.08 నిమిషాలకు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన శ్రీసాక్షిశ్రీకి తాళం వేసిన దృశ్యం దర్శనమిచ్చింది. అసలే వైద్యులు లేక ప్రజారోగ్యం పడకేసిన కొత్తపల్లి పీహెచ్సీలో సిబ్బంది సైతం సమయ పాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్(బావుపేట) పీహెచ్సీ సైతం మూసి ఉంది.


