● రోడ్డు సేఫ్టీ ఐజీ రమేశ్ నాయుడు ● చొప్పదండిలో అరైవ్, అలైవ్ సమావేశం
చొప్పదండి: యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని, నిర్లక్ష్యంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు సేఫ్టీ ఐజీ రమేశ్ నాయుడు అన్నారు. పట్టణంలోని జీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం పోలీసులు అరైవ్, అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సీపీ గౌస్ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించక తప్పు చేస్తున్నారని, సహజ మరణాల తర్వాత అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్నారని, తెలంగాణలో ఏడు వేలకు పైగా మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. కాలం చెల్లిన వాహనాలు వాడొద్దని, లైసెన్స్ లేకుండా డ్రైవర్లుగా ఉద్యోగం చేయొద్దన్నారు. నిద్రలేకుండా వాహనాలు నడపొద్దని సూచించారు. గంగాధర మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను రహవీర్గా గుర్తించి, సన్మానించారు. అనంతరం 140 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య పరీక్షలను చేశారు. ఏసీపీ విజయ్ కుమార్, సీఐ ప్రదీప్కుమార్, ఎస్సైలు నరేశ్రెడ్డి, వంశీకృష్ణ, రాజు పాల్గొన్నారు.
చొప్పదండి: చొప్పదండి మున్సిపాలిటీని బాల్య వివాహ రహిత పట్టణంగా అధికారులు ప్రకటించారు. గత మూడేళ్లుగా ఒక్క బాల్య వివాహం జరుగక పోవడంతో అధికారికంగా ప్రకటించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, ఐసీడీఎస్ అధికారి నర్సింగరాణి తెలిపా రు. కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశాలతో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో, ఇతర శాఖల భాగస్వామ్యంతో బాల్య వివాహాలు జరుగకుండా సమర్థవంతంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా చొప్పదండి మున్సిపాలిటీలో బాల్య వివాహాలు జరుగకుండా చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కేవీ ఐబీ ఫీడర్ పరిధి లోని ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్ ఏరియాలలో కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్ టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు. అలాగే విద్యుత్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పనుల కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 33/11 కేవీ బొమ్మకల్ సబ్స్టేషన్ పరిధిలోని శ్రీపురంకాలనీ, రజ్వీచమన్, సిటిజన్కాలనీ, ప్రియదర్శికాలనీ, కృష్ణానగర్, ధర్మానగర్, బైపాస్రోడ్డు, బొమ్మకల్, గుంటూరుపల్లి, సలాఫినగర్ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తామని కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు తెలిపారు.


