ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ తగిలింది. ఈ దేశానికి చెందిన అత్యంత విలువైన డ్రోన్ ఒకటి ప్రమాదానికి గురైంది. అమెరికా అధికారిక ప్రకటనతో ఈ విషయం ధృవీకరణ అయ్యింది. హర్ముజ్ జలసంధిలో గల్లంతైన ఆ డ్రోన్ విలువ రూ.22,000 కోట్లుగా తేలింది.
అమెరికా నౌకాదళం హర్ముజ్ జలసంధిలో అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ ఫోర్సీ(MQ-4C) ట్రిటాన్తో నిఘా నిర్వహిస్తోంది. దీని విలువ 238 మిలియన్ డాలర్లు. ఈ కాస్ట్లీ డ్రోన్ ప్రమాదాన్ని ‘క్లాస్ A మిషప్’గా నమోదు చేశారు. ఈ ఘటన ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన మరుసటిరోజే (ఏప్రిల్ 9) జరిగింది.
అధికారుల వెల్లడించిన ప్రకారం.. డ్రోన్ 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 10,000 అడుగుల కిందకు పడిపోయింది. VVPE804 అనే కాల్సైన్తో మూడు గంటల సాధారణ మిషన్లో ఉన్న ఈ డ్రోన్ అకస్మాత్తుగా 7700 ఎమర్జెన్సీ కోడ్ ప్రసారం చేసింది. ఇది సాధారణంగా విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే సంకేతం. ఆ అత్యవసర సంకేతం ఇచ్చిన తర్వాత అది కనపడకుండా పోయింది. అది హర్ముజ్లో గల్లంతైనట్లు అధికారికంగా ధృవీకరించారు.

MQ-4C ట్రిటాన్ అమెరికా నౌకాదళంలో అత్యంత ఆధునిక డ్రోన్లలో ఒకటి. దీన్ని అధిక ఎత్తులో, దీర్ఘకాలిక మిషన్ల కోసం రూపొందించారు. సముద్రంపై ఎక్కువసేపు పర్యవేక్షించేందుకు, సైనిక కదలికలపై నిఘా కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన నార్త్రోప్ గ్రుమ్మాన్ లిమిటెడ్ సర్వీసెస్గా వీటిని తయారు చేసింది. మొత్తం 68 డ్రోన్లు ఫ్లస్ 2 ప్రోటోటైపులను అమెరికా సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా 48 డ్రోన్లను రంగంలోకి దించింది. మరో విశేషం ఏంటంటే.. ఆస్ట్రేలియా కూడా నాలుగు డ్రోన్లను ఆర్డర్ చేసింది. అయితే తాజా డ్రోన్ నష్టం అమెరికా నౌకాదళానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు.


