అత్యంత విలాసవంతమైన భారీనౌక టైటానిక్.. ఆ నౌక తన మొదటి ప్రయాణంలోనే విషాదం చోటుచేసుకుంది. మంచు పర్వతాన్ని ఢీకొట్టింది. ఆ సంఘటన 1912 ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి జరిగింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 2224 మంది నౌకలో ఉండగా 1517 మంది మృతిచెందారు. చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది. టైటానిక్ నౌక మునిగిపోతున్న సమయంలో ఒక లైఫ్ బోట్ ద్వారా ప్రాణాలతో బయటపడిన ప్రయాణీకురాలు ధరించిన లైఫ్ జాకెట్ శనివారం జరిగిన వేలంలో 6,70,000 పౌండ్లకు(సుమారు రూ.8.39 కోట్లు) అమ్ముడైంది.
ఈ లైఫ్ జాకెట్ను నౌకలోని ఫస్ట్-క్లాస్ ప్రయాణీకురాలు లారా మాబెల్ ఫ్రాంకటెల్లి ధరించారు. దీనిపై ఆమెతో పాటు అదే లైఫ్ బోట్లో ప్రాణాలతో బయటపడిన వారి సంతకాలు కూడా ఉన్నాయి. పశ్చిమ ఇంగ్లాండ్లోని డెవిజెస్లో 'హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్' వేలం సంస్థ నిర్వహించిన టైటానిక్ జ్ఞాపికల అమ్మకాల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దీని అంచనా ధర 2.50 లక్షల నుండి 3.50 లక్షల పౌండ్లు కాగా.. ఒక అజ్ఞాత టెలిఫోన్ బిడ్డర్ అంతకంటే చాలా ఎక్కువ ధరకు దక్కించుకున్నారు. అదే వేలంలో టైటానిక్ లైఫ్ బోట్కు చెందిన ఒక సీట్ కుషన్ 3,90,000 పౌండ్లకు ($5,27,000) అమ్ముడైంది. టెన్నెస్సీ, మిస్సౌరీలోని రెండు టైటానిక్ మ్యూజియం యజమానులు దీనిని కొనుగోలు చేశారు. టైటానిక్ జ్ఞాపికలలో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన వస్తువు ఒక బంగారు పాకెట్ వాచ్. 700 మంది బాధితులను రక్షించిన ' ఆర్ఎంఎస్ కార్పాతియా' నౌక కెప్టెన్కు బహుకరించిన ఈ వాచ్, 2024లో 1.56 మిలియన్ పౌండ్లకు అమ్ముడైంది.
టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం ఐర్లాండు లోని బెల్ఫాస్టు్క చెందిన హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1909లో అమెరికాకు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమై మార్చి 31, 1912కి పూర్తయింది. ఇది 269 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉండేది. ప్రయాణికులు నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3,547 మందిని మోయగలదు. నౌకలోనే ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, రెండు తరగతుల ప్రయాణికులకు గ్రంధాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది. నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.


