
చైనాలోని దక్షిణ ప్రాంతం భారీ వరదలకు విలవిలలాడిపోతోంది. దీనికితోడు పలుచోట్లు కొండ చెరియలు విరిగిపడుతూ పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలకు వందలాది ఇళ్లు నీటమునగగా, కొండ చెరియలు విరిగిపడిన ఘటనల్లో పలు ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి.
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే లెక్కకుమించినంత మంది గాయపడివుంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
దక్షిణ చైనాలో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.