గతంలో స్థిరమైన ఉద్యోగం, చేతినిండా సంపాదన వచ్చాక మాత్రమే భారతీయులు పెట్టుబడుల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి జెన్-జీ యువత (Gen Z) తమ ఇరవయ్యో ఏట అడుగుపెట్టకముందే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ (SIP)ల గురించి చర్చిస్తున్నారు.
భారతీయ యువతలో ఆర్థిక అవగాహన మునుపటి కంటే గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, ఆన్లైన్ ఆర్థిక సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల పెట్టుబడి అనేది కేవలం నిపుణులకు పరిమితమైన అంశం కాకుండా, సామాన్యుల రోజువారీ సంభాషణల్లో భాగమైపోయింది. నేడు యువతకు పెట్టుబడి పెట్టడం అనేది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి ఒక చిహ్నంగా మారుతోంది.
భారీగా పెరుగుతున్న డీమాట్ ఖాతాలు
పెట్టుబడి ధోరణిలో వచ్చిన ఈ భారీ మార్పునకు కోవిడ్-19 మహమ్మారి ఒక ప్రధాన చోదక శక్తిగా నిలిచింది. లాక్డౌన్ సమయంలో యువత ఆన్లైన్లో గడిపే సమయం పెరగడంతో యూట్యూబ్, పాడ్కాస్ట్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సంక్లిష్టమైన మార్కెట్ అంశాలను సులభంగా అర్థం చేసుకున్నారు. గణాంకాల ప్రకారం, జనవరి 2023 నుండి ఆగస్టు 2024 మధ్య కాలంలోనే దేశంలో 6 కోట్లకు పైగా కొత్త డీమాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, నేటి యువత కేవలం సాంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్ వంటి మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మిగులు ఆదాయాన్ని వారు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈక్విటీలు, సిప్ (SIP)లలో మదుపు చేస్తున్నారు.
మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యువత జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2025 మధ్య నాటికి భారతదేశంలో డీమాట్ ఖాతాల సంఖ్య 20 కోట్లు దాటగా, అందులో ప్రతి నలుగురిలో ముగ్గురు 30 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. సెబీ (SEBI) 2025 సర్వే ప్రకారం, పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న వారిలో 56 శాతం మంది జెన్-జీ యువతే ఉన్నారు. అయితే, ఈ ఉత్సాహంతో పాటు కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుతం యువతకు సమాచారం తక్కువగా లేదు, కానీ అతిగా ఉంది. వేల సంఖ్యలో లభించే ఆన్లైన్ టిప్స్, మార్కెట్ అంచనాలలో ఏది నిజమో, ఏది ఊహాగానమో గుర్తించడం వారికి కష్టతరంగా మారుతోంది. కేవలం 30 శాతం మంది యువకులకు మాత్రమే కాంపౌండింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి ప్రాథమిక సూత్రాలపై సరైన అవగాహన ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అవగాహన అవసరం
ఈ నేపథ్యంలో, యువత కేవలం ఉత్సాహంతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడులు పెట్టడం అత్యవసరం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి లోనుకాకుండా ఉండటానికి క్రమబద్ధమైన ఆర్థిక విద్యా కార్యక్రమాలు (Structured Learning) అవసరం. ప్రస్తుతం మార్కెట్ సిమ్యులేషన్స్, మెంటార్షిప్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ల ద్వారా యువతకు వాస్తవ మార్కెట్ పరిస్థితులపై శిక్షణ ఇచ్చే ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం త్వరితగతిన లాభాలు ఆర్జించడం కాకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాట్లను పెంపొందించుకున్నప్పుడే భారత పెట్టుబడి రంగం సుస్థిరమైన భవిష్యత్తును కలిగి ఉంటుంది. యువత ఎంత మంది మార్కెట్లోకి వస్తున్నారనే దానికంటే, వారు ఎంత అవగాహనతో వస్తున్నారనేదే ముఖ్యం.

- అజయ్ లఖోటియా, స్టాక్గ్రో ఫౌండర్ & సీఈవో


