ఆర్థిక స్థిరత్వానికి రిస్క్ లు
నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం..
→ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది.
→ రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి.
→ డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.
→ డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి.
→ రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్ను మెరుగుపర్చాలి.
→ 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
→ మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది.
→ రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది.


