న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఇకనైనా మేల్కొని స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన 'బస్వరల్డ్ ఇండియా కాన్క్లేవ్ 2025'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
శిలాజ ఇంధనాల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం దేశం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ "తీవ్రమైన సమస్యల" నుండి బయటపడాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలే మార్గమని ఆయన పేర్కొన్నారు.‘డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఇక భవిష్యత్తు లేదు. తయారీదారులు జీవ ఇంధనాలు (Bio-fuels), సీఎన్జీ (CNG), ఎల్ఎన్జీ (LNG), ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేయాలి’ అని నితిన్ గడ్కరీ అన్నారు.
భవిష్యత్తు ఇంధనం 'హైడ్రోజన్'
భారతదేశం ఇప్పటికే ప్రయోగాత్మకంగా 10 ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులను నడుపుతోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో హైడ్రోజన్ అత్యంత కీలకమైన ఇంధనంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇథనాల్ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్ల అభివృద్ధిపై పరిశ్రమ ఇప్పటికే దృష్టి సారించిందని, ప్రస్తుతం వాహనాలు E20 (20% ఇథనాల్ మిశ్రమం) ఇంధనంతో విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.
ప్రజా రవాణాలో భద్రతే ముఖ్యం
ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేసింది. బస్సు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం భౌతిక, వీడియో అనుమతులతో పాటు వివరాలను 'వాహన్' పోర్టల్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. తయారీదారులు కేవలం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంపైనే కాకుండా.. నాణ్యత, భద్రత,ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయాలని ఆయన సూచించారు.
ఎలక్ట్రిక్ బస్సులకు భారీ డిమాండ్
రాబోయే మూడేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ సుమారు 1,50,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, ప్రస్తుత తయారీ సామర్థ్యం ఏడాదికి 70,000 బస్సులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.


