గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 319 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ4లో నమోదైన రూ. 304 కోట్లతో పోలిస్తే సుమారు 5 శాతం అధికం. సమీక్షాకాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 9,413 కోట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది రూ. 10,553 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం (చెల్లించినది పోగా) రూ. 4,907 కోట్ల నుంచి రూ. 5,677 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 2 బేసిస్ పాయింట్లు క్షీణించి 5.95 శాతం నుంచి 5.93 శాతానికి నెమ్మదించింది. వ్యాపారం 19 శాతం వృద్ధితో రూ. 5.75 లక్షల కోట్లకు ఎగిసింది. మొత్తం అసెట్స్లో మొండి పద్దులకు ప్రొవిజనింగ్ క్యూ1లో నమోదైన 1.92 శాతం నుంచి క్యూ4లో 1.52 శాతానికి తగ్గింది.
మైక్రో ఫైనాన్స్ విభాగం మినహా అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉందని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్ తెలిపారు. పరిశ్రమవ్యాప్తంగా సూక్ష్మ రుణాల విభాగంలో సవాళ్లు ఎదురైనట్లు వివరించారు. ప్రస్తుతం స్థూల మొండిబాకీలు, నికర మొండిబాకీలు వరుసగా 1.61 శాతం, 0.48 శాతానికి దిగి వచ్చినట్లు చెప్పారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో గత ఫిబ్రవరిలో బయటపడిన రూ.590 కోట్ల ఫ్రాడ్ ఉదంతం మార్చి త్రైమాసిక ఫలితాలపై (Q4FY26) ఎటువంటి ప్రభావం చూపలేదని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్ తెలిపారు. ఇతర బ్యాంకులలో ఇలాంటి సంక్షోభాలు సద్దుమణగాలంటే దాదాపు సంవత్సరం పడుతుందని, కానీ ఇక్కడ అలా జరగలేదని పేర్కొన్నారు.


