నిందితుల్లో బీటెక్ విద్యార్థి 2కిలోల 110 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్న లాలాపేట పోలీసులు
పట్నంబజారు: లిక్విడ్ గంజాయిని తరలిస్తూ.. బీటెక్ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్ సీఐ ఏవీ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్ ఒక కళాశాలలో బీటెక్ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.


