ఢిల్లీ: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు.
‘ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకుల్లో 70 శాతం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేషన్ విధిస్తున్నారు. కానీ పెట్రోలియం శాఖ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సప్లై కి ఎలాంటి అవరోధాలు లేవని చెప్తుంది
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయికి , ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం.
పెట్రోల్ డీజిల్ కొరత ఫలితంగా వ్యాపారులు రైతులు పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలి. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఏపీ అవసరాలకు తగిన పెట్రోల్ డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.


