అదేరోజున కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమల: చంద్రగ్రహణం సందర్భంగా వచ్చే నెల 3న శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల (మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం) వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు తిరుమలలో తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20 నుంచి మార్చి 5 వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులకు అనుమతి ఉండదని చెప్పారు.
పుష్కరిణి, ప్రవేశ, నిష్కమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది, పుష్కరిణిలో అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పోత్సవాల కారణంగా ఈనెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, వచ్చేనెల 3న కుమారధార తీర్థ ముక్కోటి సందర్భంగా భక్తులను ఉదయం 5 నుంచి 9గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.


