వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొంటూ.. పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. పార్టీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక వార్రూమ్లను ఏర్పాటు చేసి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వార్రూమ్లలో సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు అవసరమైన సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, కేంద్ర కార్యాలయ స్థాయిలో మూడు దశల్లో వార్రూమ్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఓటర్ల జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు అమలు చేసిన వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.


