పోలీస్ అధికారిని ట్రాప్ చేసిన దళారులు
అధికారితో మహిళలు అశ్లీలంగా ఉన్న వీడియోలతో రూ.లక్షల్లో వసూలు
ఆపై పోలీస్ అధికారి భార్యకు వీడియోలు పంపి కుటుంబంలో కలహాల సృష్టి
ఆలస్యంగా వెలుగుచూస్తున్న నిజాలు
ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లో విస్తృతంగా చర్చ
రహస్యంగా విచారణ చేయిస్తున్న పోలీస్ బాస్
సాక్షి టాస్క్ఫోర్స్: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు తరహాలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఏకంగా ఓ పోలీస్ అధికారిపైనే వలపు వల విసిరి, డబ్బు వసూలు చేయడమే కాకుండా, ఆయన కుటుంబంలోనూ చిచ్చు రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ధర్మవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉండే ఓ పోలీస్ అధికారి భార్య నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీస్ అధికారి కుటుంబ వ్యవహారం కావడంతో ఈ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని పైకి చెప్పినప్పటికీ, వాస్తవాలు మాత్రం వేరే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆ పోలీస్ అధికారికి మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని ఓ సచివాలయంలో పని చేసే ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. దీనికితోడు ధర్మవరానికి చెందిన కొంతమంది దళారులు, చేనేత వ్యాపారులతో ఆ పోలీస్ అధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
వారు తమ పనులు చేయించుకునే క్రమంలో ఆ అధికారికి అందమైన అమ్మాయిలను ఎరగా వేసి వారి చెప్పు చేతల్లోకి తీసుకున్నట్లు సమాచారం. సచివాలయం ఉద్యోగినితో వివాహేతర సంబంధం విషయం కూడా తెలియడంతో వారు ఆయన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నారు. అప్పు రూపంలో అంటూ రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశారు. కొంత కాలం తర్వాత పోలీసు అధికారి తన డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో సమస్యలు మొదలయ్యాయి. డబ్బులు అడుగుతావా అంటూ వారు పోలీసు అధికారికి సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను భార్యకు పంపించారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
తన భర్త వేరే మహిళలతో ఉన్న వీడియోలు చూసిన భార్య తీవ్ర డిప్రెషన్కు గురైంది. ఆ క్రమంలోనే ఆమె మృతిచెందింది. మృతిౖపెనా స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. మృతదేహాన్ని చూడటానికి వెళ్లినప్పుడు బంధువులు పోలీస్ అధికారిని నిలదీసినప్పటికీ, ఫిర్యాదులో మాత్రం అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై పోలీస్ బాస్ రహస్య విచారణ జరిపించి, నివేదికను తెప్పించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. హనీట్రాప్ మూలాలు ఉండడంతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. తొందర్లోనే నిజానిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.


