-
పీపీఏ ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) పేర్కొన్న ధరల ప్రకారమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) ఆదేశించింది. ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. పవన విద్యుత్కు యూనిట్ రూ.2.43, సౌర విద్యుత్కు యూనిట్ రూ.2.44 చొప్పున చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. అలాగే, పీపీఏలను పునః సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఉందని, అభ్యంతరాలన్నీ ఈఆర్సీ ముందు ప్రస్తావించుకోవాలని పవన, సౌర విద్యుత్ సంస్థలకు స్పష్టంచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం రద్దుచేసింది. ఈఆర్సీ ముందున్న ఓపీ 17, ఓపీ 27కు సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కొట్టేసింది. ఇక పవన, సౌర విద్యుత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్లో కోత విధిస్తూ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలుచేస్తూ లోడ్ డిస్పాచ్ సెంటర్ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పవన, సౌర విద్యుత్ కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. పీపీఏ నిబంధనలను మార్చలేం.. ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల పవన, సౌర విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతున్నామన్న డిస్కంల వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలను వసూలుచేస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులని చెప్పడం సరికాదని ధర్మాసనం స్పష్టంచేసింది. పీపీఏ నిబంధనలను పార్టీలు గానీ, కోర్టుగానీ మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పీపీఏలను ఏపీఈఆర్సీ పునః సమీక్షించేంత వరకు మధ్యంతర ఏర్పాటుకింద పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని, అవి చట్టానికి అనుగుణంగాలేవని ధర్మాసనం ఆక్షేపించింది. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దుచేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అలాగే.. 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరించి రేట్లను కుదించే అధికారం ఈఆర్సీకి లేదని ధర్మాసనం తెలిపింది. టారిఫ్లో మార్పులతో పెట్టుబడులపై ప్రభావం ‘ప్రజాభిప్రాయాన్ని సేకరించి, డిస్కంల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఏపీఈఆర్సీ పవన విద్యుత్ టారిఫ్ను ఖరారుచేసింది. దీనికి అనుగుణంగానే రూ.30 వేల కోట్ల మేర పవన విద్యుత్ రంగంలో దీర్ఘకాల ప్రణాళికల ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. గ్లోబల్ వార్మింగ్, ఉద్గారాల తగ్గింపులో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి దానికి సంబంధించిన టారిఫ్, నిబంధనల్లో మార్పుచేస్తే అది ప్రపంచంలోని పెట్టుబడిదారులపై పడుతుంది. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఒప్పందాలను కొనసాగించేందుకు డిస్కంలు సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. డిస్కంలు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. కాబట్టి డిస్కంల ఆర్థిక పరిస్థితికి మరేదైనా కారణం కావొచ్చుగానీ, పీపీఏలో నిర్ణయించిన టారిఫ్ కాదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
గత సర్కారు పాపం.. డిస్కమ్లకు శాపం
సాక్షి, అమరావతి: ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు విద్యుత్ సంస్థలకు శాపంగా మారింది. అవసరం లేకున్నా విద్యుత్ తీసుకోవడం ఒకటైతే, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకోవడం మరో కోణం. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల–పీపీఏల) విషయంలో ఇదే తేల్చి చెప్పింది. 2014–19 మధ్య జరిగిన ఒప్పందాలన్నీ డిస్కమ్లను నిలువునా అప్పులపాలు చేసే విధంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజాధనాన్ని కొంతమందికి కట్టబెట్టే ఈ విధానంపై పునఃసమీక్ష అవసరమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలిరోజుల్లోనే భావించింది. రాష్ట్రంలో 2015 వరకు 91 పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్నాయి. వాటి సామర్థ్యం కేవలం 691.55 మెగావాట్లు. కానీ ఆ తర్వాత 2019 వరకు ఏకంగా 3,494 మెగావాట్ల సామర్థ్యంగల 133 ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు గరిష్టంగా యూనిట్కు రూ.3.74 చెల్లిస్తే.. 2015 నుంచి యూనిట్కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఈ పీపీఏల వల్ల డిస్కమ్లు ప్రైవేటు సంస్థలకు రూ.39,280 కోట్లు చెల్లించాలి. సోలార్ విద్యుత్ విషయంలోనూ ఇదేవిధంగా కొనసాగింది. 2014 వరకు రూ.384 కోట్ల విలువ చేసే 92 మెగావాట్ల మేరకు 11 పీపీఏలు ఉండేవి. 2015–19 మధ్య 2,308 మెగావాట్ల మేర 36 పీపీఏలు జరిగాయి. వీటివిలువ రూ.22,868 కోట్లు. ఫలితంగా ఇప్పటికీ పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఎక్కడా లేని ధర 2015–19 మధ్య ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు అప్పటి ప్రభుత్వం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడలేదు. వాళ్లనుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చినా లెక్కజేయలేదు. 2014లో సోలార్ విద్యుత్ను యూనిట్ రూ.6.99 ధరతో పీపీఏ చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్ యూనిట్ రూ.6.88 ధరకి పీపీఏ చేసుకుంది. 2016లో సోలార్ పీపీఏలు దాదాపు 1,500 మెగావాట్ల మేర జరిగాయి. అప్పుడు కూడా గరిష్టంగా యూనిట్ ధర రూ.6.80. అదే సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం యూనిట్ రూ.4.66 ధరతో నెడ్క్యాప్, జెన్కో, ఎన్టీపీసీ, సెకీతో ఒప్పందాలు చేసుకుంది. ఆ తర్వాత కాలంలోఅన్ని రాష్ట్రాల్లో యూనిట్ ధర రూ.2కు పడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం రూ.4.50కే పీపీఏలు చేసుకోవడాన్నిబట్టి వీటివెనుక రాజకీయ కారణాలున్నాయనే విమర్శలొచ్చాయి. పవన విద్యుత్ పీపీఏల విషయానికొస్తే 2014లో అన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.50 ఉంటే.. మన రాష్ట్రంలో రూ.4.83 చొప్పున జరిగాయి. తమిళనాడు, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.46 కొనసాగినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్కు రూ.4.84తోనే ఒప్పందాలు చేసుకుంది. ఈ విధంగా ప్రైవేటు పట్ల అపరిమిత ప్రేమ చూపించడం వల్ల.. ఇప్పుడు డిస్కమ్లు ఆర్థికభారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. -
గత ప్రభుత్వ కరెంట్ షాక్..రూ.39,280 కోట్లు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో కేవలం కొన్ని కంపెనీలకే ప్రాధాన్యతనివ్వడం డిస్కమ్ (విద్యుత్ పంపిణీ సంస్థలు)ల నష్టానికి కారణమైంది. దీనిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా పీపీఏల వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తావించింది. 2015 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు భారీగానే ఉన్నాయి. వీటి విలువ ఏకంగా రూ.39,280 కోట్లు. నాడు పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గుతాయని ఇతర రాష్ట్రాలు ముందుగానే గుర్తించాయి. రాష్ట్ర విద్యుత్ అధికారులు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి ఇదే అంశాన్ని తీసుకెళ్లారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టింది. మిగతా రాష్ట్రాలన్నీ బిడ్డింగ్లకు వెళ్తున్నా ఏపీ మాత్రం జనరిట్ టారిఫ్ (నిర్దేశించిన టారిఫ్ మేరకు) ఇచ్చింది. అదీ కూడా టీడీపీ ప్రభుత్వ పెద్దలతో ఏదో రకంగా సంబంధం ఉన్న కంపెనీలే కావడం అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు గ్రీన్కో అనే సంస్థ రూ.12,672 కోట్ల విలువైన 16 ఒప్పందాలు చేసుకోగా.. ఈ మొత్తంలో ఏకంగా గ్రీన్కోకు 32 శాతం వాటా కట్టబెట్టారు. అలాగే రెన్యూ అనే సంస్థ రూ.8,513 కోట్ల విలువైన 15 ఒప్పందాలు చేసుకోగా.. ఈ మొత్తంలో ఆ సంస్థకు 22 శాతం లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో మొత్తం 133 పవన విద్యుత్ పీపీఏలపై సవివరమైన సమాచారాన్ని డిస్కమ్లు.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందించాయి. ఇందులో రూ.5,548 కోట్ల విలువైన 64 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన కమిటీ పునఃపరిశీలించాలని కోరింది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా పవన విద్యుత్కు యూనిట్కు రూ.2.43 చొప్పున చెల్లిస్తే సరిపోతుందని పంపిణీ సంస్థలు అంటున్నాయి. ఇలా చేస్తే ఉత్పత్తిదారులకు ఏమాత్రం నష్టం కూడా ఉండదు. పైగా ప్రైవేటు సంస్థలకు చెల్లించే రూ.39,280 కోట్ల ప్రజాధనాన్ని రూ.20 వేల కోట్లకు కుదించే వీలుంది. అంటే.. దాదాపు రూ.19 వేల కోట్లకుపైగా ప్రజాధనం వృథా కాకుండా చేసే వీలున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రం చెప్పిందీ వినలేదు.. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేంద్రం పెట్టిన లక్ష్యం ఒకటైతే.. 2015 నుంచి టీడీపీ ప్రభుత్వం చేసింది మరొకటి. 2015–16లో విద్యుత్ వినియోగంలో 5 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి తీసుకోవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ ఏపీ మాత్రం ఏకంగా 5.59 శాతం మేర పీపీఏలు చేసుకుంది. 2016–17లో 8.6 శాతం, 2017–18లో 9 శాతం లక్ష్యమైతే 19 శాతం, 2018–19లో 11 శాతం లక్ష్యమైతే 23.4 శాతం తీసుకుంది. 2016–17 నుంచి 2018–19 మధ్య కాలంలో 6,190 మిలియన్ యూనిట్ల పవన, సౌర విద్యుత్ తీసుకోవాల్సి ఉండగా.. దీనికి రెట్టింపునకు పైగా 13,142 మిలియన్ యూనిట్లు తీసుకుంది. దేశంలో పవన విద్యుత్ ధరలు పడిపోతే.. మన రాష్ట్రంలో మాత్రం యూనిట్కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లకు పీపీఏలు చేసుకున్నారు. 2014లో ఎలాంటి బిడ్డింగ్ లేకుండానే సోలార్ విద్యుత్కు యూనిట్ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున ఏకంగా 649 మెగావాట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం పీపీఏలు చేసుకుంది. ఈ ధరను కూడా ఏటా 3 శాతం పెంచేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. అంటే.. పదేళ్ల తర్వాత యూనిట్ విద్యుత్ ధర ఏకంగా రూ.9 వరకూ వెళ్లే అవకాశం ఉంది. 2017లో రాజస్తాన్లో బిడ్డింగ్లో సోలార్ ధర యూనిట్ రూ.2.44కు పడిపోయింది. ఏపీ మాత్రమే పీపీఏలు ఉండటం వల్ల యూనిట్కు రూ.6.99 వరకూ చెల్లించాల్సి వస్తోంది. -
రాష్ట్రంలో పెరగనున్న జల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరగబోతోంది. 2030 నాటికి 7,700 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఈ దిశగా పెద్ద ఎత్తున చేపడుతున్న మినీ హైడల్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అధికారులు డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టుల రూపకల్పన దిశగా అడుగులేసే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 7,700 మెగావాట్లకు తీసుకెళ్లడం ద్వారా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం నుంచి యూనిట్ విద్యుత్ 90 పైసలకే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవాలంటే.. 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రణాళికలు సిద్ధం చేసిన నెడ్క్యాప్ ఏపీలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. నదుల దిగువ భాగాన ఉన్న నీటిని ఎగువకు పంపి, డిమాండ్ వేళ విద్యుదుత్పత్తి చేస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో జలపాతాల ద్వారా వెళ్లే నీరు వృథా కాకుండా ఆనకట్ట ద్వారా నిల్వ చేసి ఎగువకు పంప్ చేసి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్క్యాప్) ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్లు రూపొందిస్తోంది. వీటి ద్వారా 31 వేల మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తేవచ్చని భావిస్తున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ రేట్లు తగ్గింపు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించింది. మార్కెట్ రేట్లకు అనుగుణంగా వాటి ధరలను తగ్గించింది. ఫలితంగా డిస్కమ్లకు రూ.60 కోట్ల మేర ఆదా అవుతుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. ► గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రంతో ఏపీ డిస్కమ్లకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2016తోనే ముగిసింది. అయినప్పటికీ పాత ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా పాత ధరలతోనే విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ల్యాంకోకు యూనిట్కు రూ.3.29, స్పెక్ట్రంకు యూనిట్కు రూ.3.31 చొప్పున డిస్కమ్లు చెల్లిస్తున్నాయి. ► అయితే, ఈ ఏడాది రెండు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు కమిషన్ అనుమతించలేదు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, ఆ రెండు సంస్థల కన్నా మార్కెట్లో తక్కువకే విద్యుత్ లభిస్తుండటమే కారణంగా ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ► లాక్డౌన్ కాలంలో బొగ్గు సమస్య రావచ్చని భావించిన డిస్కమ్లు గ్యాస్ విద్యుత్ను తీసుకోవాలని కోరడంతో ఏప్రిల్, మే నెలలకు కమిషన్ అనుమతించింది. అయితే వారం రోజుల్లోనే ప్రపంచ మార్కెట్లో గ్యాస్ రేట్లు తగ్గాయి. దీంతో జూన్ నుంచి విద్యుత్ తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ తీసుకుంటే, స్పెక్ట్రంకు యూనిట్కు రూ.3.31కి బదులు రూ. 2.71, ల్యాంకోకు రూ.3.29కి బదులు యూనిట్కు రూ.2.69 చొప్పున చెల్లించాలని డిస్కమ్లను ఆదేశిస్తూ టారిఫ్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకే అనుమతించింది. ► అక్టోబర్, నవంబర్ నెలల్లో తదుపరి సంవత్సరానికి అవసరమైన వార్షిక, ఆదాయ అవసర నివేదికలను డిస్కమ్లు రూపొందిస్తాయి. అప్పుడు ఈ రెండు సంస్థల నుంచి విద్యుత్ తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాయి. ► సెప్టెంబర్ వరకూ తీసుకునే ఈ విద్యుత్ దాదాపు వెయ్యి మిలియన్ యూనిట్లు ఉంటుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. కమిషన్ తగ్గించిన రేట్ల వల్ల విద్యుత్ సంస్థలకు యూనిట్కు 60 పైసల చొప్పున, మొత్తం రూ.60 కోట్లు ఆదా అవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement