పట్టు జారాక.. పటిష్టత కోసం.. | silk for strength .. .. | Sakshi
Sakshi News home page

పట్టు జారాక.. పటిష్టత కోసం..

Feb 5 2015 2:23 AM | Updated on Jul 28 2018 6:48 PM

జిల్లాలో ఒకప్పుడు పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమ పర్యసానంతో పూర్తిగా చతికిలపడింది. ఐదేళ్లలో పతనం చవిచూసింది.

టవర్‌సర్కిల్: జిల్లాలో ఒకప్పుడు పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమ పర్యసానంతో పూర్తిగా చతికిలపడింది. ఐదేళ్లలో పతనం చవిచూసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించడంతో అప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ద్వితీయ శ్రేణినాయకులు, కార్యకర్తలు డీలాపడిపోయారు. వారంతా తలోదిక్కు వెళ్లి వివిధ పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో జెండా మోసే వారు కరువయ్యారంటే పార్టీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
 గతమెంతో ఘనం..: టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో జిల్లా ప్రజలు ఆ పార్టీకి అండగా నిలిచారు. 2009 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు.
 
 
 ఆ తర్వాత పరిణామాలతో జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య పార్టీని వీడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీ-టీడీపీ అధ్యక్షుడిగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్.రమణకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే జవసత్వాలు కోల్పోయిన టీడీపీ జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. 2014 ఎన్నికల్లో ఎల్.రమణ, జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు గెలుపు కోసం పార్టీ ప్రత్యేక దృష్టిపెట్టినా ప్రజలు తిరస్కరించడంతో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ తర్వాత షరామామూలుగానే కేడర్ మొత్తం ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది.
 
 ముఖ్యమంత్రి హోదాలో..: తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం చేజిక్కించుకున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 19న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు జిల్లా కేంద్రంలోనే ఉండి పార్టీ ఓటమికి కారణాలు, పార్టీ పటిష్టతకు చేపట్టవలసిన చర్యలపై పార్టీ శ్రేణులతో సమీక్షిస్తారని తెలిసింది.
 
 ఒకప్పుడు వెంకటస్వామి, జువ్వాడి చొక్కారావు వంటి రాజకీయ ఉద్దండులపై కొత్త వారిని పోటీలో నిలిపి మట్టికరిపించిన టీడీపీ ఇప్పుడు పూర్తిగా జవసత్వాలు కోల్పోయి సుప్తచేతనావస్థలో ఉంది. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నైరాశ్యంలో ఉన్న నాయకులకు భరోసా కల్పించేదెలా? పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? అనే అంశాలపై చంద్రబాబునాయుడు సమీక్షించనున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement