
వివరాలు వెల్లడిస్తున్న నగర కొత్వాల్ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో:నగర టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ జటావత్ మహేష్ జైలుకు వెళ్లకుండా కరోనా ‘కాపాడింది’. కోర్టులో హాజరుపరిచే ముందు చేపట్టే వైద్య పరీక్షల్లో అతడికి క్వారంటైన్ స్టాంప్ పడటమే దానికి కారణం. దీంతో రిమాండ్కు తీసుకోవడానికి జైళ్ల శాఖ అంగీకరించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు హోం క్వారంటైన్కు పంపారు. ఈ వ్యవహారంలో ఆద్యంతం అసలేం జరిగిందంటే.. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్ మహేష్(19) తన 15వ ఏటనుంచే నేరబాటపట్టాడు. రాజధానితో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటి వరకు మహేష్పై 50కి పైగా నేరాలు చేశాడు. మూడేళ్ల క్రితం మైనర్గా ఉన్న మహేష్ను పట్టుకున్న వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి మూడేళ్ల శిక్ష విధించడంతో గాజులరామారంలోని గవర్నమెంట్ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్లో ఉంచారు. అక్కడి అధికారులు మహేష్ సహా మరికొందరికి వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించారు. అందులో భాగంగా ఇతగాడిని గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో(ఏన్ఏసీ) చేర్పించారు. రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్ గతనెల ఎన్ఏసీ నుంచి పరారయ్యాడు.
లాక్డౌన్కు వారం రోజుల ముందు ఇలా బయటకు వచ్చిన మహేష్కు మైనార్టీ సైతం తీరింది. అప్పటి నుంచి లాక్డౌన్ మొదలయ్యే వరకు కంచన్బాగ్, సరూర్నగర్, నల్లగొండ, మలక్పేటలో నాలుగు నేరాలు చేశాడు. ఇందులో రెండు వాహనచోరీలు కాగా, మరో రెండు ఇళ్లలో దొంగతనాలు. ఇతడి ఆచూకీ కనిపెట్టిన ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ మేరకు నగర కొత్వాల్ అంజనీకుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రూ.15 లక్షలు విలువైన సొత్తు, వాహనం రికవరీ చూపారు. మహేష్పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించినట్లు ఆ సందర్భంగా కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. మహేష్ను తదుపరి చర్యల నిమిత్తం కంచన్బాగ్ పోలీసులకు అప్పగించారు. ఇతడి అరెస్టుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసిన కంచన్బాగ్ అధికారులు ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ సందర్భంలో మహేష్ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో అక్కడి వైద్యులు అతడి చేతిపై 14 రోజులకు క్వారంటైన్ ముద్ర వేశారు.
నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తీసుకువెళ్ళారు. మహేష్ చేతిపై క్వారంటైన్ స్టాంపు చూసిన జైలు అధికారులు రిమాండ్కు తీసుకోవడానికి నిరాకరించారు. తమ వద్ద ఐసోలేషన్ బ్యారెక్ లేని కారణంగా జైలులోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన కంచన్బాగ్ పోలీసులు మహేష్ను మరోసారి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో వ్యక్తిగత బాండ్ తీసుకుని మహేష్ను హోం క్వారంటైన్కు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రి కంచన్బాగ్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మహేష్ను చంటపల్లి తండాకు తీసుకువెళ్లి ఇంటి వద్ద క్వారంటైన్ చేసి వచ్చారు. మహేష్కు క్వారంటైన్ స్టాంపు పడిందనే విషయం తెలియడంతో అతడిని పట్టుకున్న, అరెస్టు తతంగం పూర్తి చేసిన టాస్క్ఫోర్స్, కంచన్బాగ్ పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాంటి ‘పాజిటివ్’లు లేకుండా ఆ 14 రోజుల తర్వాత అతడు క్షేమంగా ఇంటి నుంచి బయటకు రావాలని అతడి కుటుంబీకుల కంటే ఎక్కువగా వీళ్లే కోరుకుంటున్నారు.