పోలీసుల క్రూరత్వం | Police brutality | Sakshi
Sakshi News home page

పోలీసుల క్రూరత్వం

Jul 25 2017 1:32 AM | Updated on Aug 21 2018 6:00 PM

దెబ్బలు తిన్న శేఖర్‌ - Sakshi

దెబ్బలు తిన్న శేఖర్‌

దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగం దుమారం మరువకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో దారుణానికి ఒడిగట్టారు.

- ప్రేమికులకు సహకరించారని చితకబాదారు
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో దారుణం
 
సిరిసిల్ల క్రైం: దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగం దుమారం మరువకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో దారుణానికి ఒడిగట్టారు. ప్రేమికులకు సహకరించారనే కార ణంతో ముగ్గురు యువకులను చావబాదారు. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల అర్బన్‌ మండలం చంద్రంపేటకి చెందిన ఎల్లయ్య కూతురు అదే గ్రామానికి చెందిన రజాక్‌ కుమారుడు ప్రేమించుకున్నారు. తమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించరనే కారణంతో ప్రేమికులు వారం క్రితం తమ ఇళ్లు విడిచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడే వివాహం చేసుకున్నారు.

అయితే, తన కూతురు కనిపించడంలేదంటూ ఎల్లయ్య సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ పేరుతో ప్రేమికుడి స్నేహితులు శేఖర్, రజాక్, సన్నీ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికులు ఎక్కడ ఉన్నారనే విషయం చెప్పాలంటూ గత శుక్రవారం నుంచి ఆదివారం వరకూ చితకబాదారు. ఆ తర్వాత వదిలేయడంతో సోమవారం విలేకరులను ఆశ్రయించారు. ప్రేమికులకు సహకరించారనే అనుమానంతో పోలీసులు తమను అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఫోన్‌చేసి తమను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన శేఖర్‌ చెప్పారు. దీనిపై సిరిసిల్ల సీఐ శ్రీనివాసరావును సంప్రదించగా, ప్రేమికుల వివరాలు తెలుసుకునేం దుకు ముగ్గురు యువకులను ఠాణాకు పిలిపించామన్నారు. ప్రేమికులు మేజర్లని తెలియడంతో వారిని వదిలివేశామని, తాము ఎవరినీ కొట్టలేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement