పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం

పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం


టైప్ వన్ డయాబెటిస్ ఇండియాలోని పిల్లల్లో భారీగా పెరుగుతోందంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ళ కాలంలో ఒక శాతం ఉండే గణాంకాలు ఐదు శాతానికి పెరిగిపోయాయని, ఇరవై ఏళ్ళ క్రితం 600 మంది పిల్లలు మధుమేహ రోగులుగా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 3 వేలకు చేరిపోయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇతర కారణాలతోపాటు ఊబకాయం పెరగడం వల్లే, ఈ సమస్య జఠిలం అవుతోందని డయాబెటాలజిస్ట్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు.



పిల్లల్లో గత రెండేళ్ళ క్రితం 1 శాతంగా ఉన్న మధుమేహ వ్యాధి, ఇప్పుడు 5 శాతానికి పెరిగిపోయిందని డయాబెటాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బేటా సెల్స్ తగ్గిపోవడమే మధుమేహ రోగులు పెరిగిపోవడానికి కారణమంటున్నారు. ఆహార పద్ధతుల్లో తీవ్ర మార్పులు రావడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో కొవ్వును వృద్ధి చేస్తాయని, ఇది ముఖ్యంగా పిల్లల్లో ఒబేసిటి పెరిగిపోవడానికి కారణమౌతోందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాక కూరగాయలు, ఆకు కూరలు ఆహారంగా తీసుకోపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం మధుమేహం వృద్ధి అయ్యేందుకు సహకరిస్తాయని ఢిల్లీకి చెందిన కొందరు డయాబెటాలజిస్టులు చెప్తున్నారు. ఇండియాలోని 40 శాతం పిల్లల్లో ఊబకాయం సమస్య కూడ ఉన్నట్లు తెలిపారు.



తీవ్రంగా దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తూ, క్రమంగా బరువు తగ్గిపోవడం, నిద్ర మత్తుగా ఉన్నట్లు అనిపించడం, కోమాలోకి వెళ్ళిపోవడం వంటివి మధుమేహ వ్యాధి లక్షణాలుగా చెప్పొచ్చని, ఈ రకమైన గుర్తులు కనిపించడాన్ని డయాబెటిక్ కెటో యాసిడోసిస్ అంటారని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో 70,000 మంది చిన్నారులు, యువకులు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఎయిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అష్రాఫ్ ఘని తెలిపారు. చిన్నారుల్లో మధుమేహం రావడం ప్రమాదకరమని, అయినప్పటికీ  టైప్ 1 డయాబెటిస్ క్రమంగా పెరుగుతూనే ఉందని ఘని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top