
బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
నెల్లూరు(క్రైమ్): వి«ధ నిర్వహణలో అనేక అపవాదులను మూటగట్టుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ చెంచురామారావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ కావడం గమనార్హం.
- ఉత్తర్వులు జారీచేసిన గుంటూరు రేంజ్ ఐజీ
- నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీకొట్టించిన ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. కేసు విచారణలో నిందితులకు ఇన్స్పెక్టర్ సహకరించారని, ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేయకుండా రూ.లక్షల్లో నగదును తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయన్ను కేసు విచారణ నుంచి తప్పించి నగర డీఎస్పీ వెంకటరాముడుకు అప్పగించారు.
- వ్యభిచారం కేసులో నిందితుల వద్ద భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని తప్పించే యత్నం చేశారు. అయితే పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో చివరికి వారి అరెస్ట్ చూపించి బెయిల్ మంజూరు చేశారనే విమర్శలు ఉన్నాయి.
- ఓ సివిల్ వివాదంలోనూ భారీస్థాయిలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
- ఈ నెల 20న బాలాజీనగర్ కానిస్టేబుల్ గోపీ పద్మావతి రియల్ఎస్టేట్ సమీపంలో ఓ వైద్య విద్యార్థినిని బెదిరించి నగదు దోచుకున్నారు. 21న ఆమెను పిలిచి లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత విద్యార్థిని విషయాన్ని ఎస్పీ విశాల్గున్నీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు చెంచురామారావు సదరు కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. అయితే విచారణలో కేసును నీరుగార్చేందుకు యత్నించారని, అందుకు కానిస్టేబుల్ నుంచి భారీగా నగదు తీసుకొని కేసును ఉపసంహరించుకోవాలని విద్యార్థిని ఒత్తిడి తెచ్చిన ఘటన పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
- స్టేషన్ పరిధిలో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులను తన అనుయాయులుగా ఏర్పర్చుకొని వారి ద్వారా పంచాయితీలు చేసి రూ.లక్షలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది సైతం అతని చర్యలతో విసిగిపోయారు. శాంతిభద్రతలను గాలికొదిలేశారనే విమర్శల నేపథ్యంలో ఎస్పీ దృష్టికి ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి నివేదికను రేంజ్ ఐజీకి సమర్పించారు.