స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ దుర్మరణం | Swiggy Delivery Boy Assassinated in Road Accident Hyderabad | Sakshi
Sakshi News home page

చక్రాల కింద నలిగిపోయిన ఆశయం

Mar 11 2020 8:50 AM | Updated on Mar 11 2020 8:50 AM

Swiggy Delivery Boy Assassinated in Road Accident Hyderabad - Sakshi

లునావత్‌ సుమన్‌ (ఫైల్‌)

మియాపూర్‌: అతడిది మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూనే ఎస్‌ఐ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మియాపూర్‌లో ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కానీ.. అతడిని విధి చిన్నచూపు చూసింది. ఫుడ్‌ డెలివరీ చేసేందుకు బైక్‌పై వెళ్లి ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. అతడి భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. భర్త మృతిని జీర్ణించుకోలేని ఆమె భోరున విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఎస్‌ఐ రవికిరణ్, మృతుడి స్నేహితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రాంపురంనకు చెందిన లునావత్‌ మితియా నాయక్, మోతి దంపతుల రెండో కుమారుడు లునావత్‌ సుమన్‌ (22). మియాపూర్‌ రెడ్డి ఇన్‌క్లేవ్‌లో భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు.

లక్ష్మి ఓ సూపర్‌ మార్కెట్‌లో ఉద్యోగం చేస్తోంది. సుమన్‌ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. అతను రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం  ఇంట్లో నుంచి బయలుదేరాడు. మియాపూర్‌ టాకీ టౌన్‌ సమీపంలో ఇడ్లీ దోశ హోటల్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకొని బొల్లారం క్రాస్‌ రోడ్డు వైపు వెళుతున్నాడు. హోటల్‌ నుంచి 100 మీటర్ల దూరంలో బైక్‌పై వెళ్లగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన జహీరాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను కిందపడ్డాడు. సుమన్‌ తలపై నుంచి వెనక చక్రం వెళ్లింది.హెల్మెట్‌ ఉన్నప్పటికీ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement