అపార్థం చేసుకుని చావబాదారు
బొకారో(జార్ఖండ్): మోరల్ పోలీసింగ్ పేరుతో అనాగరిక చర్యలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామ సంరక్షణ పేరుతో తమను తాము మోరల్ పోలీసులుగా చెప్పుకుంటున్న కొందరు యువకులు ఓ జంట పట్ల కర్కశంగా ప్రవర్తించారు. దంపతులను అపార్థం చేసుకుని పట్టపగలే వారికి నరకం చూపించారు. లాఠీలతో ఆ భార్యాభర్తలను చావబాదారు. దెబ్బలకు తాళలేక తమను వదిలేయండని బాధిత మహిళ ఎంత వేడుకున్నా ఆ కర్కోటకులు విడిచిపెట్టలేదు.
ఈ ఘటన మంగళవారం బొకారోలో చోటుచేసుకుంది. ఈ దురాగతాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామనీ, దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. దంపతులపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న వారంతా చోద్యం చూశారే తప్ప ఎవరూ స్పందించక పోవడం గమనార్హం.