అవినీతిలో కూరుకుపోయిన వైఎస్సార్ సీపీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా...
సాక్షి కథనాలపై సీఎంవో ప్రకటన
సాక్షి, విజయవాడ బ్యూరో: అవినీతిలో కూరుకుపోయిన వైఎస్సార్ సీపీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి మరోసారి విష ప్రచారం మొదలు పెట్టిందని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రైతులను రెచ్చగొట్టారని, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారని, పంటలను తగులబెట్టించారని, ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వేల ఎకరాలు కొన్నారని విష ప్రచారం చేస్తున్నారని గురువారం రాత్రి విడుదల చేసి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదని, 32 లక్షలమంది డిపాజిట్ దారులు ప్రయోజనాలను పణంగా పెట్టారని, ప్రతిఫలంగా రూ. 425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ను చినబాబు కొట్టేశారనే ఆరోపణలు సరికాదన్నారు. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ పైనాన్షియల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 ప్రకారం మిగిలిన అగ్రిగోల్డ్ ఫామ్స్ ఆండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులతో పాటుగా హాయ్ ల్యాండ్ నుకూడా జప్తుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
మురళీమోహన్ అక్రమంగా భూములు కొన్నారనడం, బాలకృష్ణ వియ్యంకుడికి 430 ఎకరాల భూమి అంటూ ఆరోపణలు సరికాదన్నారు. 3,129 ఎకరాలు కొన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.