రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రకటించింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వాడివేడిగా జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సమావేశానికి అద్వానీ హాజరు కాలేదు. ముందునుంచి అనుకుంటున్నట్లు గానే మోడీ నియామకం పట్ల ఆయన తన వ్యతిరేకతను ఇలా చాటారు. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన నరేంద్రమోడీ, తొలుత రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు. అద్వానీ సహా కొంతమంది సీనియర్లు మోడీ నియామకం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినా, ప్రధానంగా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటం మోడీకి కలిసొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నికల ప్రచారానికి ఆయన ఇప్పటికే శ్రీకారం చుట్టడం, మోడీ సభలకు ప్రధానంగా యువత నుంచి మంచి మద్దతు లభిస్తుండటంతో మోడీనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించారు. ముందునుంచే బీజేపీ కార్యాలయం ముందు కోలాహలం నెలకొంది. 'మోడీకో లావో, కాంగ్రెస్కో హఠావో, దేశ్కో బచావో' అంటూ నినాదాలు మిన్నంటాయి.
Sep 13 2013 7:27 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement
