శంకర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ (జీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో ఏర్పాటు చేసిన ఎథినిక్ రన్ (జీరో వేస్ట్ రన్)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రూపొందించిన జాతీయ వేదిక శ్రీస్వచ్ఛ సేతుశ్రీ యాప్ని ప్రారంభించారు. 3కే, 5కే, 10కే రన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. గండిపేట్ వెల్పేర్ సోసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్వచ్ఛ సేతు’ యాప్ ఉద్యమంలో ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూమిలో కరిగే వస్తువుల వాడకంపై దృష్టి సారించాలని, తద్వారా పర్యావరణం విషతుల్యం కాదని అభిప్రాయపడ్డారు. జీడబ్ల్యూఎస్ ప్రతినిధి తిమ్మయ్యగారి వాణి మాట్లాడుతూ.. వ్యర్థాలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగానే ఈ ఏడాది జీరో వేస్ట్ రన్ ఏర్పాటు చేశామని, ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి తుమ్మల, ఎక్స్పీరియం ఎండీ రాందేవ్ రావు, వాటా ఫౌండేషన్ ప్రతినిధి ఉదయ్ కుమార్, జేఎస్ఆర్ అన్నమయ్య, మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సీపీ సజ్జనర్


