న్యూస్రీల్
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
బడి గంటకు
విద్యార్థులకు స్వాగతం పలకనున్న సమస్యలు
వికారాబాద్: సుదీర్ఘ 53 రోజుల వేసవి సెలవుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దశలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. ఎప్పటిలాగే మళ్లీ వారికి సమస్యలే ఆహ్వానం పలకనున్నాయి. విద్యా హక్కుచట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు దాటినా? రెండు–మూడేళ్లు వరుసగా మనఊరు–మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టినా సర్కారు బడులు ఆశించిన మేర విద్యార్థులను ఆకర్శించలేకపోతున్నాయి. ప్రభుత్వ బడులలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం చేపట్టిన రెండు కార్యక్రమాలు ముగిశాక కూడా సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఇంకా వందకు పైగా పాఠశాలల్లో మరమ్మతులు అవసరమని అధికారులే తేల్చారు. సమస్యల పరిష్కారం వేగవంతం చేయాల్సిన తరుణంలోనూ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి.
కొత్తగా అల్పాహార పథకం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందజేస్తుండగా ఈసారి కొత్తగా అల్పాహారం సై తం ఇస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పాఠశాలలో గతేడాది నుంచే అల్పాహారం అందిస్తున్నారు. కాగా ఈసారి నుంచి జిల్లాకు చెందిన మరో ఆరు మండలాల్లో అల్పాహార పథకం ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిగి, దోమ, కుల్కచర్ల, తాండూరు, బొంరాస్పేట, యాలాల మండలాల్లో ఈ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు చేర వేసింది.
మొదటి రోజు నుంచే పుస్తకాలు
జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 65,503 మంది విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీ, ఆదర్శ, గురుకుల పాఠశాలలు కలుపుకొంటే 84,208 మంది చదువుకుంటున్నారు. ఏటా పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు బడులకు చేరడంలో జాప్యం జరిగేది. కానీ ఈసారి వారం రోజులు ముందుగానే పాఠ్య, నోట్ పుస్తకాలు బడులకు చేర్చారు. విద్యార్థులకు అందాల్సిన యూనిఫాంలు ఇంకా బడులకు చేరలేదు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, డీఈఓలు ఈసారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గడిచిన పదేళ్లలో ప్రభుత్వ బడులకు సమాంతరంగా ప్రైవేటు పాఠశాల వ్యవస్థ తయారైంది. పదేళ్ల క్రితం వరకు 20 శాతం మాత్రమే ప్రైవేట్ బడుల్లో అడ్మిషన్లు ఉండేవి. ప్రస్తుతం అది 60 శాతానికి పైగా చేరుకుంది. 40 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలలో కొత్తగా చేరుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు 40శాతం వరకు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,063 ప్రభుత్వ బడులలో 84,208 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం 185 ప్రైవేట్ పాఠశాలలలో 45,042 మంది విద్యార్థులున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఐదారు ఏళ్లలో ప్రైవేట్ బడులలో ప్రస్తుత సంఖ్య రెండింతలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దుద్యాల్: మండల వ్యాప్తంగా మూడు గిరిజన తండాల్లో ప్రభుత్వ పాఠశాలలు రెండేళ్లుగా మూతపడ్డాయి. సోమ్లానాయక్ తండా, వాల్యా నాయక్ తండా, రోటిబండ తండాలలో బడులు నిర్వీర్యమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతోనే పాఠశాలలు మూతబడ్డాయని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను కేటాయిస్తే తప్పకుండా తన పిల్లలను సర్కారు బడులకు పంపిస్తామని చెబుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న తరుణంలో ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకంజ
ఇంకా సిద్ధం కాని యూనిఫాంలు
ప్రభుత్వ బడులకు తగ్గుతున్న అడ్మిషన్లు
జిల్లాలోని పాఠశాలల్లోఒకటో తరగతి అడ్మిషన్లు ఇలా..
ప్రభుత్వ ప్రైవేట్
పదేళ్ల క్రితం 9,500 2,640
ప్రస్తుతం 6,124 7,522
నాలుగేళ్లలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఇలా..
విద్యాసంవత్సరం చేరిన విద్యార్థులు
2022–23 9,085
2023–24 7,784
2024–25 7,078
2025–26 6,124


