తాండూరు టౌన్: పనికోసం వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణది హత్యేనని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని సీతారాంపేట్ కమ్యూనిటీ హాల్లో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ అనే యువకుడు ఏప్రిల్ 29న పని నిమిత్తం రుద్రారం వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. అయితే అతని మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. హరికృష్ణది ముమ్మాటికే హత్యేనని ఆరోపించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. వెంటనే నిందితులను అరెస్టు చేయని ఎడల పెద్ద ఎత్తున ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పలు ప్రజాసంఘాల నాయకులు కె.శ్రీనివాస్, మల్కయ్య, చంద్రయ్య, అబ్దుల్ వాహద్, గుమ్మడి రత్నం, బుగ్గప్ప, బలరాం, రవి, ఆంజనేయులు, లక్ష్మి, సాయిలు, వెంకటయ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం


