
సీఎం అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం
కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ కమిషన్,ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై నిర్ణయం
గౌరవ వేతనం లేకుండా ఆదర్శ రైతుల నియామకం
ఉద్యోగుల ఆర్థికేతర అంశాల ఆమోదం.. ఒక డీఏ అయినా ఇచ్చే చాన్స్
రాజీవ్ యువవికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లపై కూడా...
సాక్షి, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యామ్ల భద్రతా ప్రాధికార సంస్థ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారీస్థాయిలో ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలతోపాటు రికవరీ చేయాలని కమిషన్ సూచించిన విషయం విదితమే.
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్చార్జ్లుగా నియమించి, భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి అ«దీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాల్లో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతోపాటు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది.
ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ గతవారంలోనే తన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించింది.
ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే ఐదు కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డీఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.
వానాకాలం పంటల అంశం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న తీరుపై కూడా చర్చించే అవకాశముంది. వాస్తవంగా జూన్ 2వ తేదీన కనీసం వంద ఇళ్లను ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేసినా, అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చోటుచేసుకోని విషయం విదితమే.