ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ సమిత్ పటేల్ దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. భారత్లో నిర్వహించిన అనుమతి లేని లీగ్లో పాల్గొనడం కారణంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై 12 నెలల నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
41 ఏళ్ల సమిత్ 2008 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ తరఫున 60 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అయితే అతనికి అసలైన గుర్తింపు కౌంటీ క్రికెట్లోనే దక్కింది. ముఖ్యంగా నాటింగ్హమ్షైర్ కౌంటీ క్లబ్కు అతను రెండు దశాబ్దాలకు పైగా సేవలందించాడు.
తన కౌంటీ కెరీర్లో 25 వేలకుపైగా పరుగులు, 800కుపైగా వికెట్లు సాధించి అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ సత్తా చాటి తన జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

ఇటీవల గోవాలో జరిగిన వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్లో పాల్గొనడం సమిత్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈసీబీ నిబంధనల ప్రకారం, అనుమతి లేని టోర్నమెంట్లలో ఆడిన ఆటగాళ్లు ఏడాది పాటు ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో ఆడటానికి అనర్హులు అవుతారు.
ఈ నిషేధంతో తన దేశీయ కెరీర్కు ముగింపు పలకక తప్పలేదని సమిత్ వెల్లడించాడు. ఈ పరిణామాలు ముందే తెలిసి ఉంటే ఆ లీగ్లో ఆడేవాడిని కాదు. ఇంకా ఒక సీజన్ ఆడే అవకాశం ఉండేదని సమిత్ బాధపడ్డాడు. ఇంగ్లండ్ దేశీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సమిత్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్లలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.
రిటైర్మెంట్ ప్రకటన అనంతరం నాటింగ్హమ్షైర్ కౌంటీ సమిత్ సేవలను ఘనంగా కొనియాడింది. క్లబ్ డైరెక్టర్ మిక్ న్యూవెల్ మాట్లాడుతూ.. సమిత్ సాధించిన విజయాలు నాటింగ్హమ్షైర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. అతని నిబద్ధత, పోరాట పటిమ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయని ప్రశంసించారు.


