మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు మరో నెలన్నర సమయం ఉండగానే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా నాట్ స్కీవర్ బ్రంట్ ఎంపిక కాగా.. ఆమెకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఛార్లీ డీన్ ఎంపికైంది.
ఈ జట్టుకు ఓ సంచలన ఎంపిక జరిగింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండానే 18 ఏళ్ల టిల్లీ కార్టీన్-కోల్మన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన టిల్లీ, సర్రే తరఫున అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి కీలక బలంగా మారే సామర్థ్యం ఆమెకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ జట్టుకు ఇస్సీ వాంగ్, లారెన్ ఫైలర్ కూడా ఎంపికయ్యారు. వీరికి ఇదే తొలి టీ20 ప్రపంచకప్. మొత్తంగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టు కొత్త వారు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది.
ఈ జట్టు ఎంపికపై హెడ్ కోచ్ ఛార్లోట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక చాలా కఠినమైన ప్రక్రియగా మారిందన్నారు. ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటం ఇంగ్లండ్ మహిళా క్రికెట్ బలాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న ఈ ప్రపంచకప్ తమకు ప్రత్యేకమని, అభిమానుల మద్దతుతో గొప్ప ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కాగా, జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ 2026 జరుగనుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఉన్నాయి.


