మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొని 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
భోజ్ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ ఛత్రపాల్ సింగ్ చౌహాన్ దీనిపై మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో ఓ పికప్ వాహనం బోల్తా పడిందని, అందులో సుమారు 35 మంది ఉన్నారని తెలిపారు. కొందరు మరణించగా దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో పికప్ వాహనంలో ఉన్న వారంతా కార్మికులని అధికారులు తెలిపారు. ఆ వాహనం అదుపుతప్పి ఎస్యూవీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో జరిగింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రమాదంపై స్పందించారు. ‘ధార్ జిల్లాలో ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చికాలియా ఫాటా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకం. మృతిచెందిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను.
మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను. ధార్కు వెళ్లి చికిత్స ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఇండోర్ డివిజనల్ కమిషనర్, ఐజీకి సూచనలు ఇచ్చాం. గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందుతుంది. దేవుడు మృతుల ఆత్మలకు శాంతి కలిగించాలి. బాధలో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


