నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా నా ఉద్దేశం.నెగెటివ్ రోలా? పాజిటివ్ క్యారెక్టరా? అనేది నేను పట్టించుకోను. పాత్ర నచ్చితే చేసేస్తా’ అని అన్నారు సినీయర్ నటి రాశి. ఆమె కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. తీరువీర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాశి హీరో తల్లి పాత్ర పోషించింది. చాలా కాలం తర్వాత రాశి తెరపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ‘నిజం సినిమాలో నెగెటివ్ రోల్ చేయడంతో హీరోయిన్గా అవకాశాలు కోల్పోయారు కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అవును. ఆ పాత్ర అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదన్నారు.
‘ఎలాంటి పాత్ర కావాలనేది నేను నిర్ణయించుకోలేదు. దర్శకులే వచ్చి..‘మిమ్మల్ని అనుకోనే ఈ పాత్ర రాశాను’ అంటారు. ఆ పాత్ర నచ్చితే చేస్తా. అంతేకాని అది నెగెటివ్ రోలా? పాజిటివ్ రోలా? అనేది చూడను. నటి అన్నాక.. ఓ నటిగా అన్నిరకాల షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేయాలి. ఆ ఉద్దేశంతోనే ‘నిజం’లో నటించా. కానీ, ఆ పాత్ర అంతగా నెగెటివ్ అవుతుందని అనుకోలేదు. ఇకపై ఏ రోల్ అయినా ప్రేక్షకులు అంగీకరించేవిధంగా ఉంటేనే చేస్తాను’ అని రాశి అన్నారు.
కాగా, తేజ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘నిజం’ సినిమాలో రాశి నెగెటివ్ పాత్ర చేసింది. విలన్గా నటించిన గోపిచంద్కి ప్రియురాలి పాత్ర అది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే రాశి అలాంటి పాత్ర చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్గా చాన్స్ రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగానే ‘పాపం ప్రతాప్’ మూవీ చేసింది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు.


