‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటున్నారు సంజయ్ దత్. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఖల్ నాయక్’. 1993లో విడుదలైన, ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలోని బలరామ్ ప్రసాద్ అలియాస్ భల్లు పాత్రలో సంజయ్ దత్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ‘ఖల్ నాయక్’ సినిమా సీక్వెల్ను ప్రకటించారు సంజయ్ దత్.
ప్రతి స్టోరీకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేసింది. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు సంజయ్ దత్(Sanjay Dutt). అలాగే ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ను ముంబైలో నిర్వహించారు.
ఈ వేడుకలో సంజయ్ దత్ మాట్లాడుతూ–‘‘నేను జైలులో ఉన్నప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా ఆలోచన వచ్చింది. ఆ సమయంలో జైలులో ఉన్న దాదాపు 4వేల మంది ఖైదీలతో ‘ఖల్ నాయక్’ సినిమా గురించి మాట్లాడాను. ఈ సినిమా వారికి నచ్చిందా? సీక్వెల్ గురించి ఆసక్తిగా ఉన్నారా? అన్న విషయాలను తెలియజేయాలని పేపర్స్ ఇచ్చాను. వారు తిరిగి ఇచ్చిన లెటర్స్ను నేను చదివాను.
‘ఖల్ నాయక్’ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చాలా మంది పేర్కొన్నారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ‘ఖల్ నాయక్’ సీక్వెల్ గురించి సుభాష్గారితో మాట్లాడాను. ఆయన సీక్వెల్కి స్కోప్ ఉందని చెప్పారు. ఇలా ఇప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సంజయ్ దత్. ఈ ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ సినిమాను అస్పెట్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ సంస్థల అసోసియేషన్తో సంజయ్ దత్ నిర్మించనున్నారు. అయితే దర్శకుడు ఎవరు? అన్నది తెలియాలి.


