సస్పెన్స్ థ్రిల్లర్లలో డైరెక్టర్ జీతూ జోసెఫ్, మోహల్ లాల్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చాలా ప్రత్యేకమైనది. ఈ సిరీస్లో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. మలయాళం ఒరిజినల్ గా ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ, భాషలకతీతంగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో కూడా రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్లో మూడో భాగం రాబోతుంది. మే 21 ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్.
ఒక నిమిషం 50 సెకన్ల నిడివి గల ఈ టీజర్, మోహన్లాల్ వాయిస్ఓవర్తో పాటు 2013 నుండి 2021 వరకు వచ్చిన పాత భాగాలలోని సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఈ టీజర్లో మోహన్లాల్ పోషించిన జార్జ్కుట్టి పాత్ర ఒక చర్చిలో కూర్చుని దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లు కూడా చూపించారు. అతను భయపడినట్లుగా, ఆత్మవిశ్వాసం లేనట్లుగా కనిపిస్తాడు.
‘నేను ఒక సాధారణ మనిషిని. నా ప్రపంచం చాలా చిన్నది, నా భార్య, నా పిల్లలు మాత్రమే. ఒక అవాంఛిత అతిథి మా ఏకాంతంలోకి చొరబడ్డాడు. నా కుటుంబాన్ని నాశనం చేయగల శక్తి ఉన్న అతిథి అతను. ఆ అతిథి మళ్లీ మా జీవితాలను నాశనం చేయడానికి తిరిగి రాకుండా ఉండేలా, మేము అతన్ని పంపించేశాం’ అంటూ మోహన్ లాల్ చెప్పే సంభాషణలతో ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్ సాగింది.


