విస్సన్నపేట: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన దబ్బిగొడ్ల వెంకట్రావు(42) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నూజివీడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఫైవ్ స్టార్ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తన భర్త రూ.5 లక్షలు లోన్ తీసుకున్నాడని, చాలా వరకు తిరిగి చెల్లించామని, ప్రతి నెల వాయిదాలు సక్రమంగానే కడుతున్నామని మృతుడి భార్య గాయత్రి తెలిపారు. ఇటీవల తనకు పాము కరవటంతో వైద్య ఖర్చుల కారణంగా వాయిదా కట్టలేదన్నారు. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు మా ఇంటికి వచ్చి నా భర్తను దుర్బాషలాడంతో మనస్తాపానికి గురై ఆత్యహత్య చేసుకున్నాడని చెప్పారు. మృతుడి భార్య స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.


