గన్నవరం: వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, కౌలుదారుల ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు చెప్పారు. మండల కేంద్రమైన ఉంగుటూరులోని మానికొండ సూర్యావతి శ్రామిక భవనంలో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల పోరాటాలకు ఉంగుటూరు పుట్టినిల్లు వంటిదన్నారు.
వ్యవసాయ కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలి..
కామ్రేడ్ అట్లూరి శ్రీమన్నారాయణ నాయకత్వంలో కూలీ రెట్లు పెంపు కోసం పోరాటాలు చేసిన ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభను ఉంగుటూరులో నిర్వహించడం అప్పటి పోరాటాలను గుర్తుచేస్తుందన్నారు. ప్రపంచంలో ఎర్రజెండా లేకుండా ఏ పోరాటం విజయవంతం కాలేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వీ వెంకటేశ్వర్లు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటంతో 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టం పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ పథకం అమలులో రూ.300 కోట్లు బకాయిలను కార్మికులు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల కోసం వ్యవసాయ కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తొలుత సంఘం సీనియర్ నాయకులు పిల్లి రాజారావు ఎర్రజెండాను ఎగురవేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్ళం వెంకటేశ్వరరావు, కార్యదర్శి బేతా శ్రీనివాసరావు, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీ లక్ష్మణస్వామి, పంచకర్ల రంగారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం సౌహర్ధ, సంఘ నేతలు పి.పవన్కుమార్, శీలం నారాయణ, మహమ్మద్ అబ్దుల్బారి, సునీత పాల్గొన్నారు.


