ఖమ్మం మామిళ్లగూడెం: గత 12ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వర్ధిల్లుతుండగా ప్రజలకు సుపరిపాలన అందుతోందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు వెల్లడించారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగుల సాధికారత కోసం కేంద్రం పెద్దపీట వేసిందని తెలిపారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా 52,243 మందికి పౌష్టికాహారం అందించగా, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 12,291 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి జరిగిందని చెప్పారు. అలాగే, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జిల్లాలో 4.68 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతోందని వివరించారు. ఇవికాక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 70వేలకు మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందాయని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, రాలింగేశ్వరావు ,గుత్తా వెంకటేశ్వర్లు, నకిరకంటి వీరభద్రం, రవిరాథోడ్, రవిగౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


