చింతకాని: డయేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈనెల 16నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రామారావు తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం ఆయన తనిఖీ చేశాక సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకునేలా బాలికల తల్లిండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, నెలాఖరున నిర్వహించే పల్స్ పోలియోకు సిద్ధం కావాలని తెలిపారు. తొలుత పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలు, వ్యాక్సినేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, వైద్యులు సోహెల్, అనిల్, సుప్రియ, తబుషుం, ఉద్యోగులు జ్యోతి, కనకతార తదితరులు పాల్గొన్నారు.


