● రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చివరి ప్రజాదర్బార్ జరగగా 3,500 దరఖాస్తులకు వచ్చాయని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. మొత్తం ప్రజా దర్బార్లలో అందిన 21,536 దరఖాస్తుల్లో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. ఇక పెన్షన్ల కోసం 4,700, భూ సమస్యలకు 4వేలు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆర్థిక సమస్యలు ఉన్నా...
రాష్ట్రప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ చేయడమే కాక మహిళా సంఘాలకు రూ.66 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. ఇక పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రెండో విడతగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మరో 2వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. చివరి నిరుపేదకు ఇళ్లు మంజూరు అయ్యే వరకు పథకం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఏదులాపురం మునిసిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ నవీన్, కయమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


