ఖమ్మంవ్యవసాయం: వేసవి సెలవులు ముగియడంతో నెల రోజుల తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల క్రయవిక్రయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 10 వేల మిర్చి బస్తాలతో పాటు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టిన మిర్చి శాంపిళ్లే కాక పత్తి, కందులు, పెసలు కూడా తీసుకొచ్చారు. నిల్వ మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.21,500, మోడల్ ధర రూ.19 వేలు, కనిష్ట ధర రూ.10 వేలుగా పలికింది. ఇక రైతులు తీసుకొచ్చిన మిర్చి ధర గరిష్టంగా రూ. 18,500, మోడల్ ధర రూ.16 వేలు, కనిష్ట ధర రూ. 10 వేలుగా నమోదైంది. ఇక తాలు మిర్చి ధర క్వింటాకు రూ.7వేల నుంచి రూ. 10వేల వరకు పలికింది. వేసవి సెలవులకు ముందు ఇంచుమించుగా ఇవే ధరలు పలికాయి.
విక్రయాలకే మొగ్గు
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుండడంతో పెట్టుబడి కోసం రైతులు మిర్చితో పాటు అపరాల పంటల విక్రయానికి మొగ్గు చూపుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు ఇతర అవసరాల కోసం పంటలను అమ్మేందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మిర్చి ధర కాస్త ఆశాజనకంగా ఉండటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని సైతం విక్రయించేందుకే ఆసక్తి ఆసక్తి బరుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 48 కోల్డ్ స్టోరేజీల్లో సగటున లక్ష బస్తాల చొప్పున మిర్చి నిల్వ ఉన్నట్లు అంచనా. ఇందులో రైతులు నిల్వ చేసిన పంట విక్రయించే అవకాశం ఉండగా, వ్యాపారులు మాత్రం ధర మరింత పెరిగే వరకు ఎదురుచూడనున్నట్లు తెలుస్తోంది.
తొలిరోజు 10 వేల మిర్చి బస్తాల రాక


