చర్ల: చర్ల మండలంలోని తిప్పాపురం గ్రామానికి జీపీఎస్ ట్రాకర్ కలిగిన ఓ రాబందు సోమవారం చేరుకుంది. నీరసించిన స్థితిలో ఉన్న ఈ రాబందు గ్రామ శివారు చెరువు వద్ద పడి ఉండగా స్థానికులు ఆహారం, నీళ్లు అందించారు. కాగా, 2024 అక్టోబర్ 1, 2వ తేదీల్లోనూ చర్ల మండలంలోని సాయినగర్ సమీప గుట్టల్లో ఇలాంటి రాబందు ఒకటి పడిపోగా అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఆ రాబందు కాలికి జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో అప్పట్లో మావోయిస్టుల అన్వేషణ కోసం కేంద్ర బలగాలు పంపించి ఉంటాయనే ప్రచారం జరిగింది. అయితే, మహారాష్ట్రలోని ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ బాధ్యులు రాబందుల సంరక్షణలో భాగంగా దాన్ని విడిచిపెట్టినట్లు తేలింది. మళ్లీ ఇప్పుడు కూడా జీపీఎస్ ట్రాకర్తో ఉన్న రాబందు రావడంతో మహారాష్ట్ర నుంచే విడిచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానికులు అటవీ శాఖాదికారులకు సమాచారం ఇచ్చారు.


