పిఠాపురం: స్థానిక కుంతీమాధవస్వామి కోనేరులో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి కోనేరు ప్రతిష్టను దిగజార్చడంతో పాటు హిందు ధర్మాన్ని హేళన చేశారని, వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిపరాశక్తి పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామిజీ అన్నారు. ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రాచీన చరిత్ర గల పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన పిఠాపురం కుంతీ మాధవస్వామి కోనేరులో ఇటీవల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సంధర్భంగా జనసేన నేతలు దేవుడి సమక్షంలోనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంలోనే ఉంటు అదే ధర్మాన్ని పాటింకపోగా అవహేళన చేశారని ఆయన మండిపడ్డారు. హిందు ధర్మంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలంటే పది మందికి వస్త్రాలు, అన్నదానం, కల్యాణాలు వంటివి చేయాలి తప్ప ఇలా కేక్లు కట్ చేయడం కొవ్వొత్తులు ఆర్పడం వంటివి హిందూ ధర్మానికి వ్యతిరేకమన్నారు. ఒక పక్క దేవుడికి పూజలు చేస్తు వేద మంత్రాలు వినిపిస్తుండగా వాటిని పట్టించుకోకుండా కేక్లు పంచుకుంటు కేకలు వేస్తు వికృత చేష్టలు చేయడం భగవంతుడి పూజను అవమానించడంతో పాటు భక్తుల మనోభావాలను మంటగలపడమే అన్నారు. ఇందుకు బాధ్యులైన వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు వెంటనే స్పందించి వేద పండితులతో కోనేరులో సంప్రోక్షణ నిర్వహించాలని లేని పక్షంలో తగిన విధంగా స్పందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కోనేరు ప్రతిష్టను దిగజార్చిన నేతలు క్షమాపణలు చెప్పాలి
ఆదిపరాశక్తి పీఠాధిపతి
నిత్యవిద్యానంద బారతి స్వామిజీ


