గోకవరం: ఓ వ్యక్తిపై దగ్గర బంధువే కత్తితో దాడి చేశాడు. ఎస్సై పవన్కుమార్ కథనం ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన దోర సతీష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం గ్రామ శివారున ఉన్న మామిడితోటలో సతీష్ మామిడికాయలు తీస్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన అదే గ్రామానికి చెందిన గూడవల్లి వెంకన్న కత్తితో సతీష్ తలపై దాడి చేశారు. ఈ విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతన్ని ప్రైవేటు వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియవచ్చింది. దాడికి పాల్పడిన వ్యక్తి, క్షతగాత్రుడు ఇద్దరూ బంధువులు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పవన్కుమార్ వివరించారు.


