కాకినాడ క్రైం: జిల్లాలోని కాజులూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉంటూ.. కాకినాడ కలెక్టరేట్లో డెప్యూటేషన్పై సీనియర్ అసిస్టెంట్గా కొనసాగుతూ.. ఏసీబీకి పట్టుబడిన చోడెపురెడ్డి శివరామ్ కుమార్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. అతడి నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తండ్రి వీరభద్రరావు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ మరణించారు. దీంతో, శివరామ్ 23 సంవత్సరాల వయస్సులో రెవెన్యూ విభాగంలో కారుణ్య నియామకం పొందారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మండల అధికారి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన అక్రమ సంపాదన మొత్తం 11 ఏళ్ల సర్వీసులో సుమారు రూ.10 కోట్లుగా ఏసీబీ అధికారులు లెక్క తేల్చారు. అయితే, దీని మార్కెట్ విలువ రూ.20 కోట్లు పైమాటేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివరామ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసి, శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సుమారు 36 గంటల పాటు నాలుగుచోట్ల చేసిన తనిఖీల్లో ఏసీబీ అదనపు ఎస్పీ కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎన్వీ భాస్కర్, బి.వాసుకృష్ణ, వై.సతీష్తో పాటు ఏలూరు నుంచి అదనపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


