మామిడి మార్కెట్ మొదట మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులను ఊరించింది. మార్కెట్కు మామిడి కాయలు పోటెత్తడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను ఒక్కసారిగా తగ్గించేయడంతో రైతులు తల్లడిల్లిపోయారు. మామిడి కాయల రకాల విషయానికొస్తే హిమాయత్ మొదట్లో 22 కిలోల బాక్స్ ధర మార్చి, ఏప్రిల్ మొదటి వారం వరకు రూ.4,500 ఉండగా.. మే వచ్చేసరికి రూ.వెయ్యికి పడిపోయింది. కేసరి రకం మొదట్లో 22 కిలోల బాక్స్ రూ.3 వేలు ఉండగా.. చివరికి రూ.500కు చేరింది. బేనిషాన్ మొదట్లో 22 కిలోల బాక్స్ రూ.1,600 వరకు లభించగా.. చివరికి రూ.500, దసిరి మొదట్లో 22 కిలోల బాక్స్ రూ.2 వేలు కాగా.. ప్రస్తుతం రూ.500లకు చేరింది. మిగతా సుందరి, ఆపూస, తోతాపరి, మల్లిక వంటి రకాల మామిడి కాయలు మొదట్లో ఓ మాదిరి మద్దతు ధర లభించగా.. చివరలో తక్కువ ధరకు పడిపోవడంతో తోటలు సాగు చేస్తున్న, లీజుకు తీసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు.


