గద్వాల న్యూటౌన్: స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు అందిస్తున్న రుణాలతో వ్యాపారాలు నిర్వహించుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ ఇందిరా క్రాంతి పథం (మెప్మా)– గద్వాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రుణమేళాలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని చెప్పారు. మహిళలు ప్రతిఒక్కరు సంఘాల్లో సభ్యులుగా చేరాలని సూచించారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతోపాటు, వాటి వడ్డీ డబ్బులను కూడా చెల్లిస్తోందన్నారు. మహిళలు కుటీర పరిశ్రమలతోపాటు పరిశ్రమలు, సూపర్ మార్కెట్లు నెలకొల్పాలన్నారు. వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేందుకు గద్వాలలో త్వరలోనే మహిళా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలతో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. పట్టణంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అండగా ఉంటానన్నారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్పర్సన్లు బ్యాంకు లింకేజీ కింద రూ.4.37 కోట్ల చెక్కును పట్టణ స్వయం సహాయ సంఘాల మహిళలకు అందించారు. కార్యక్రమంలో కమిషనర్ జానకిరాంసాగర్, కౌన్సిలర్లు బాబర్, ముత్యాల లక్ష్మి, వేదవతి, రామలింగేశ్వర్ కాంమ్లే, నాగులు యాదవ్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు.


