ఖార్టూమ్: యుద్ధం సృష్టించే విధ్వంసాలు అన్నీఇన్నీ కాదు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోతాం. ఇదే విధంగా నష్టపోయింది సూడాన్. అక్కడ లక్షలాది మంది రోజుకు ఒక్క పూట భోజనంతోనే జీవిస్తున్నారని ఎన్జీఓలు చెబుతున్నాయి. ఆ దేశంలో ఆహార సంక్షోభం ఇక్కడితోనూ ఆగకుండా మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఎన్జీఓల తాజా నివేదిక చెబుతోంది. చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
“సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది. ఈ యుద్ధం సూడాన్లో ప్రజలు ఆకలి కేకలు పెట్టేలా చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఇది ఒకటి. లక్షలాది మందిని నిరాశ్రయులుగా మార్చింది” అని యాక్షన్ అగైనెస్ట్ హంగర్, కేర్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, మెర్సీ కార్ప్స్, నార్వీజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ తాజాగా నివేదికలో పేర్కొన్నాయి.
దాదాపు మూడు సంవత్సరాల ఘర్షణ, హింస, సూడాన్ ఆహార వ్యవస్థను క్రమంగా దెబ్బతీసింది. ఘర్షణ తీవ్రంగా ఉన్న ఉత్తర దార్ఫూర్, దక్షిణ కొర్డోఫాన్ రాష్ట్రాల్లో లక్షల కుటుంబాలు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయగలుగుతున్నాయి. వారు ఒక్కోసారి పూర్తిగా ఒక రోజు మొత్తం భోజనాన్ని మానేస్తున్నారు. అలాగే, జీవించేందుకు చాలా మంది ఆకులు, పశువుల మేత తినే స్థితికి చేరుకున్నారు. చిన్నారులకూ ఈ కష్టాలు తప్పడం లేదు. ఇది ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతోందని ఎన్జీఓల నివేదిక తెలిపింది.
వేలాది మంది మృతి
సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య 2023 ఏప్రిల్లో యుద్ధం ప్రారంభమైంది, ఇది తీవ్ర హింసకు దారి తీసి ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా మారింది. 1.2 కోట్ల మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలివెళ్లాల్సి వచ్చింది. 3.3 కోట్లకు పైగా ప్రజలకు మానవతా సాయం అవసరం ఉంది.
గత మూడేళ్లలో 40,000 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సహాయ సంస్థలు నిజమైన మరణాల సంఖ్య దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నాయి. 2026 మానవతా అవసరాలు, ప్రతిస్పందన ప్రణాళిక ప్రకారం, సూడాన్ జనాభాలో 61.7 శాతం (2.89 కోట్లు) మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.
సైన్యం మద్దతుతో ఉన్న సూడాన్ ప్రభుత్వం కరువు పరిస్థితి లేదని చెబుతుండగా, తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులకు తాము బాధ్యత కాదని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చెబుతోంది.
ఉమ్ బారు ప్రాంతంలో తీవ్రమైన పోషకాహార లోపం కరువు స్థాయిని మించి ఉందని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ గుర్తించింది. అక్కడ ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం రేటు కరువు స్థాయికి దాదాపు రెట్టింపు ఉంది. అలాగే కర్నోయి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
యుద్ధం వల్ల మహిళలు, బాలికలు అధికంగా ప్రభావితమయ్యారు. ఎందుకంటే వారు పొలాలకు, మార్కెట్లకు, నీటికి వెళ్లినప్పుడు అత్యాచారం, వేధింపులను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది.


