పశ్చిమాసియా(ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా)యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటివల కాలంలో గ్యాస్ సిలిండర్లు కొరతగా మారటం, ధరల పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లు కొరత అనేక రంగాలను దెబ్బతీస్తోంది. వంటగ్యాస్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కొందరు ఈ ఎల్పీజీ గ్యాస్ కష్టాల రాకమునుపే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ 52 ఏళ్ల మహిళ రూపొందించిన పొయ్యి. ఎవరామె..?, ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..
ఒడిశాకు చెందిన 52 ఏళ్ల సుభ్రా రాణి మొహంతి ఆవిష్కరణ ఎల్పీజీ గ్యాస్ కష్టాలకు ఊరటగానూ సామాన్యుడి పాలిటి వరంగానూ మారింది. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని తారదాపడ గ్రామానికి చెందిన సుభ్రా రాణి మొహంతి 2018లో వంట ఖర్చులు తగ్గేలా, గ్రామీణ మహిళలు, అట్టడగు వర్గాల కుటుంబాలకు మద్దతిచ్చేలా తక్కువ ఖర్చుతో బయోమాస్ వంటపొయ్యిని రూపొందించారామె. పొగరహితమైన, సులభంగా తీసుకెళ్లగలిగే ఈ పొయ్యికి ఆమె 'రాకెట్ చుల్హా' అని పేరు పెట్టారు.
కొబ్బరి పీచు, కట్టెలు, రంపపు పొట్టు వంటి స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించారు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా ఇంధన వినియోగాన్ని దాదాపు 50 శాతం తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా, సాంప్రదాయ కట్టెల ఆధారిత పొయ్యిలతో పోలిస్తే దీని నుండి వెలువడే పొగ చాలా తక్కువగా ఉంటుంది. సుమారు దశాబ్దం క్రితం గుజరాత్లోని బరోడాకు చెందిన ఒక శాస్త్రవేత్త నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత, మొహంతి తన సంస్థ ఎస్ఎస్ అసోసియేట్స్ ద్వారా తన నివాసంలోనే బయోమాస్ పొయ్యిల తయారీని ప్రారంభించారు. ఈ యూనిట్ సహజ డ్రాఫ్ట్ (రాకెట్-రకం), ఫోర్స్డ్ డ్రాఫ్ట్ వంటి వంట పొయ్యిలు రెండింటినీ ఉత్పత్తి చేస్తున్నారామె.
సహజ డ్రాఫ్ట్ పొయ్యి కింద నుండి గాలిని తీసుకుంటుంది, ఇది బయోమాస్కు ఆక్సిజన్ను అందించి, దాదాపు పూర్తి దహనాన్ని నిర్ధారిస్తుంది. దీని ఫలితంగా సాంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే వంటచెరుకులో 50 శాతం ఆదా, వంట సమయం 50 శాతం తగ్గడమేగాక మారు 70 శాతం మాత్రమే తక్కువ పొగ వస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైనది, కంటి చికాకు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని అని మొహంతి చెబుతున్నారు.
ఫోర్స్డ్ డ్రాఫ్ట్ పొయ్యి, దహన గదిలోకి గాలిని సరఫరా చేయడానికి బ్లోయర్ను ఉపయోగిస్తుంది, ఇది సమర్థవంతమైన దహనాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఎల్పిజితో పోలిస్తే సుమారు 90 శాతం తక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది, 60 శాతం వరకు ఇంధనాన్ని, వంట సమయాన్ని ఆదా చేస్తుంది.
ఆమె భర్త సత్యబ్రత్ మొహంతి ఈ పొయ్యిల మార్కెటింగ్లో ఆమెకు సహకరిస్తారు. కలహండి జిల్లాలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) పాఠశాలలు, వసతి గృహాల వినియోగం కోసం ఈ పొయ్యిలను సేకరించింది. అంతేగాదు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు మరో 18 రాష్ట్రాల్లో, అలాగే నైజీరియా, దక్షిణాఫ్రికా, కెనడా వంటి విదేశాల్లో కూడా ఈ స్టవ్లను విక్రయిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు.
ఈ కృషికి గాను, సుభ్రారాణి మొహంతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిక్షా సమ్మాన్తో సత్కారం, అనేక ప్రశంసలు, అవార్డులు, గౌరవాలను అందుకున్నారు కూడా. ప్రస్తుతం సుభ్రా రాణి ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ పొయ్యిల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) కలిసి పనిచేస్తున్నారు.
(చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..)


