ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన నాసిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ.. తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ చేసింది.
దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ.. “నాసిక్లో ఈ విషయం మా దృష్టికి రాగానే, మేము తక్షణ చర్యలు తీసుకున్నాము. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశాము. మేము అధికారులకు సహకరిస్తున్నాము, ఈ విచారణ ముగింపు ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.
దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఈ ఘటన "చాలా తీవ్రమైనది" అని అభివర్ణించారు. అంతే కాకుండా త్వరితగతిన స్పందించిన నాసిక్ పోలీసులను ప్రశంసించారు.
ఇదీ చదవండి: టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నాసిక్ పోలీసులు ప్రస్తుతం పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ హెచ్ఆర్ అధికారిని విచారిస్తున్నారు, ఇప్పటివరకు, కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.


